మల్లి
"ఏమ్మా మల్లి ఇంత ఆలస్యమైంది అని అడిగాడు పొలానికి క్యారేజీ తీసుకువచ్చిన తన కూతుర్ని రామారెడ్డి. "ఏం లేదు నాన్న నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాను . "నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చావా! దారిలో పాటలు పాడుకుంటూ వచ్చావా! అని అడిగాడు రామారెడ్డి. ఎందుకంటే ప్రతిరోజు రామారెడ్డికి ఇది మామూలే. రెండు మూడు సార్లు కూతురి ఇంకా రావటం లేదని ఎదురు వెళ్లేసరికి చెట్టు మీద ఉన్న కోయిలని ,పాకలో ఉన్న పశువుని పొలం గట్టు మీద ఉన్న చెట్లని, చేలో ఉన్న పంటని చూస్తూ ఏదో పాటలు పాడుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ వస్తోంది మల్లి.
"ఏమ్మా ఎప్పుడు ఆ పాట లేనా తొందరగా రా !ఆకలేస్తుంది అంటూ కేకలేసాడు రామారెడ్డి. చిన్నప్పటి నుంచి రేడియో పట్టుకుని వదలదు.ఎవరి ఇంటికి వెళ్ళని మల్లి ఈమధ్య తరచూ పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్లి ఏదో పాటల ప్రోగ్రాం చూడడం మొదలుపెట్టిందని రామారెడ్డికి భార్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
"ఏంటో ఈ పిల్లకి అలవాటు ఎలా వచ్చిందో. చిన్నప్పటినుంచి ఊర్లో జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల పందిళ్ళలోనూ శ్రీరామనవమికి శివరాత్రి జాతరలోనూ ఏదో భక్తి గీతాలు పాడుతూ ఉంటుంది.
"ఇవి ఎక్కడ నేర్చుకున్నావ్ అమ్మ అంటే అమ్మమ్మగారి ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ నేర్పింది అని చెప్పింది.
రామా రెడ్డికి మల్లి ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పటినుంచి గారాబంగా పెంచి ఊర్లో ఉండే హై స్కూల్ వరకు చదువు చదివించాడు రామారెడ్డి. ఆడపిల్లని పై చదువులకు పంపడానికి రామారెడ్డికి ఇష్టం లేదు. దానికి తోడు ఆ ఊరి నుంచి కాలేజీకి వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు దూరం వెళ్ళాలి. ఆ ఊరికి బస్సు లేదు సరైన రోడ్డు సౌకర్యం లేదు.
ఇంకవర్షాకాలం వస్తే ఆ రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంటుంది. మగపిల్లలైతే సైకిల్ మీద వెళ్లి చదువుకుంటూ ఉంటారు. ఆడపిల్లల చదువు అక్కడితోటి ఆపేయాల్సిన పరిస్థితి. అందులో ఎంతోమంది తెలివైన పిల్లలు ఉన్న బస్సు సౌకర్యం లేక చదువుకోడానికి ఎవరు ముందుకు వెళ్ళలేక పోతున్నారు. ఇకపోతే ఎవరికైనా ఏదైనా రోగం వస్తే అర్జంటుగా వెళ్లాలంటే చాలా కష్టం. ఆ సమయానికి ఆటో గాని, రిక్షా కానీ ఆ ఊర్లో దొరకవు. పక్క ఊరు నుంచి రావాలి. కొన్ని సమయాల్లో సరైన వైద్య సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు .
రామారెడ్డి తన కూతురు మల్లికి కూడా ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలనే తొందరలో ఉన్నాడు. మొదట్లో ఎంతో అమాయకంగా ఉండే మల్లి క్రమేపీ అమ్మమ్మ చెప్పిన పాటల నే కాకుండా రేడియోలో వచ్చే పాటలు, అలాగే టీవీలో వచ్చే పాటలు నేర్చుకుని పాడడం ప్రారంభించింది. అలా ఆ ఊరిలో జరిగే రాముల వారి కళ్యాణం లో మల్లి పాడిన పాట విని ఆ ఊరు హై స్కూల్ హెడ్ మాస్టర్ శంకరం "నీ గొంతు చాలా బాగుంది అమ్మ. చాలా శ్రావ్యంగా ఉంది. నువ్వు పాడిన పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. తప్పనిసరిగా నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి టీవీలో జరగబోయే పాటల పోటీ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పాడు. అయితే ఈ పాటల పోటీకి కొత్త సిరీస్ ప్రారంభించేటప్పుడు మన పక్క ఊర్లో మూడు నెలలలోఆడిషన్ జరుగుతుంది నిన్ను నేను తీసుకెళ్తాను అంటూ ప్రోత్సహించాడు.
అలా శంకర మాస్టర్ ప్రోత్సాహంతో రాత్రి పగలు తేడా లేకుండా పాటలని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది మల్లి. గురువు లేని విద్య ఎలా ఉంటుంది?. తప్పు లేవో ,ఒప్పులేవో తెలియదు. అయితే మాస్టర్ సలహా ఇవ్వడంతోటి ఊరుకోలేదు పక్క టౌన్ లో తనకు తెలుసున్న సంగీతం మాస్టారు దగ్గర పాటలో మెలకువలు నేర్పించడానికి మల్లి ని జాయిన్ చేశాడు.
అయితే మల్లి తండ్రి కూతుర్ని అక్కడ ఉంచడానికి ఇష్టపడక "మాస్టారు ఆడపిల్లను అక్కడ ఉంచడానికి నాకు ఇష్టం లేదండి
అన్నాడు. " లేదు నాన్న నేను అక్కడ ఉండను. ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచే వెళ్లి వస్తాను అంది మల్లి.
"మీరు ఏమీ భయపడకండి. నా జాగ్రత్తలు నాకు తెలుసు. నాకు ప్రపంచం గురించి కూడా తెలుసు అంది ధైర్యంగా మల్లి.
అలా తండ్రికి ధైర్యం చెప్పి ఉదయం లేచి క్యారేజీ పట్టుకుని ఐదు కిలోమీటర్లు అష్ట కష్టాలు పడి చేరుకుని అక్కడి నుంచి బస్సు ఎక్కి మాస్టారు ఇంటికి వెళ్లి పాఠాలు చెప్పించుకుని సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేది. మంచి శ్రావ్యమైన గొంతు, నేర్చుకోవాలని ఉత్సాహం, పట్టుదల మల్లి లో గమనించి సంగీతం మాస్టర్ చాలా శ్రద్ధగా చెప్పడం ప్రారంభించారు.
అలా మూడు నెలలు గడిచిన తర్వాత పక్క టౌన్ లో జరిగే ఆడిషన్ టెస్ట్ కి మల్లి తోపాటు ,హెడ్మాస్టర్ శంకరం కూడా వెళ్లారు. ఇసుక వేస్తే రాలనంత జనం. అందరూ ఇంచుమించుగా మల్లి వయసు వాళ్లే. సంగీతం బాగా నేర్చుకున్నంత మాత్రాన పోటీలో నెగ్గుతారనే గ్యారెంటీ ఉండదు. ఆ సమయంలో వాళ్లు పాట ఎలా పాడారు! అన్నదే ముఖ్యం. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారు అంటారు. పది రోజుల తర్వాత మల్లి ఆడిషన్ టెస్ట్ కి సెలెక్ట్ అయ్యిందని ,పాటల పోటీలకి రమ్మని కబురు పంపారు. ఇంకేముంది పాటల పోటీలో నెగ్గినంత ఆనంద పడింది మల్లి.
ప్రతిరోజు రాత్రి పగలు లేకుండా అదే ధ్యాస. పాడిన పాటే నేర్చుకోవడం. ఎలాగైనా ఈ పాటల పోటీలో నెగ్గాలని పట్టుదలతో బాగా ప్రాక్టీస్ చేసింది మల్లి.
అలా మూడు రౌండ్లు లో విజయం సాధించి ఆఖరి రౌండ్ లో పాడడానికి సిద్ధపడింది మల్లి. సినిమాలకు సంగీత స్వరాలు సమకూర్చే ఒక పెద్దాయన మరియు ఆ రాష్ట్ర ఒక మంత్రి గారు కూడా న్యాయ నిర్ణేతలుగా వచ్చారు .
మొదటిసారిగా అటువంటి మహానగరంలో పాట పాడడానికి అంత పెద్ద స్టేజి ఎక్కిన మల్లి ని అందరూ విచిత్రంగా చూశారు. చూడడానికి నల్లగా పెద్ద పెద్ద కళ్ళతో, పళ్ళు ఎత్తుగా ఉండి, ఒక పల్లెటూర్ నుంచి వచ్చిన పిల్లలా బట్టలు కట్టుకుని వచ్చిన
మల్లి ని చూసి ఈ అమ్మాయి ఇన్ని రౌండ్లు దాటి ఎలా వచ్చింది? అని అనుకున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ సంగీతం నేర్చుకున్న వాళ్ళు.
ఈ అమ్మాయికి సంగీతం కూడా రాదు. పల్లెటూరు నుంచి వచ్చింది అనుకుంటూ ఉన్నారు. ఒక మంచి చలనచిత్రంలోని పాట. శ్రావ్యమైన పాట. సంగీతం ప్రధానంగా గల పాట . సాహిత్యం విలువలు ఉన్న పాట. మల్లి ఆ పాట పాడుతుంటే ఆ హాల్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. అందరూ ఎంతో ఆనందంతో మల్లి ని చూడడం ప్రారంభించారు. కళ్ళు మూసుకుని ఎంతో తన్మయత్వంతో రాగయుక్తంగా పాడిన పాట విని పాట అప్పుడే అయిపోయిందా! అని అనుకున్నారు ప్రేక్షకులు. న్యాయ నిర్నేతలతో సహా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కళ్ల వెంట నీళ్లు వచ్చేయి మల్లికి. మొదటి విజేతగా మల్లి ని ప్రకటించారు.
"తన స్పందన తెలియజేస్తూ మల్లి తన ఊరి గురించి, ఊరిలోని రోడ్ల గురించి, ఆడపిల్లలు పడుతున్న కష్టాలు గురించి ,తను ఏ విధంగా కష్టపడి పాటలు నేర్చుకున్న విషయం గురించి చెప్పి ఏడుస్తూ తన ఊరికి బస్సు సౌకర్యం కల్పించమని మంత్రిగారిని డైరెక్ట్ గా అడిగేసింది.
ఇన్ని వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చూస్తున్న ఆ వేదిక మీద అలా అడిగేసరికి మంత్రిగారు తన బాధ్యత నిర్వర్తించుకోవడానికి వెంటనే మల్లి ని వివరాలు అడిగి తెలుసుకుని ఆ డిపో మేనేజర్ తో మాట్లాడి ఆ ఊరికి వెంటనే బస్సు సౌకర్యం కల్పించారు.
మల్లి పాటతో ఒక సామాజిక ప్రయోజనం సిద్ధించిందని ఆ ఊరి ప్రజలు ఎంతగానో సంతోషించారు. బస్సును చూసి మురిసిపోయారు. పండగ చేసుకున్నారు. ఇంతవరకు ఆ మల్లి అడవిలో సువాసనలు వెదజల్లేది. ఇప్పుడు ఎక్కడ చూసినా మల్లి మాటే. ఇంతవరకు ఆ ఊరు గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఊరు వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్లోకి ఎక్కింది. పేపర్లలో ఫ్రంట్ పేజీలో కనబడింది. టీవీ వార్తల్లోకి ఎక్కింది. ఆ ఊరి వాళ్ళు రోజు మల్లి ని తలుచుకొని రోజు ఉండదు. ఆ తర్వాత కొద్ది రోజులకి మల్లికి పెళ్లి అయింది. సరాగాలు పాడే మల్లి శ్రీమతి అయిపోయింది. ఆ ఊరి నుంచి అత్తవారింటికి వెళ్లిపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279