అన్వర్ అభ్యర్థన ను ఇంతియాజ్ ఖాతరు చేయలేదు. అతడి తొందర, ఆరాటం అతడిని ఓపిగ్గా ఉండనివ్వలేదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ చేతిలో ఉన్నప్పుడు ఎవరు ఊరుకుంటారు ? అరగంట లోపే అన్వర్ బృందం  తలదాచుకునే ప్రదేశం గుర్తించగలిగాడు .  వాళ్ళక్కడికి
చేరకముందే  తన ఫోర్స్ తో  ఆ ప్రదేశం దరిదాపుల్లో  పొజిషన్ లో ఉండి పోయాడు.  ఈ  అవకాశం  ఎట్టి పరిస్థితుల్లోనూ తను జారవిడుచుకోలేడు.  ఇటు డిపార్ట్మెంట్ , అటు డ్రగ్స్ రాకెట్ . విశాల్ ఆత్మహత్య పెనుసవాళ్ళు. ప్రభుత్వ ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి. 
పందొమ్మిది  మంది డ్రగ్ బ్యాంకర్స్. అన్వర్ పోలీస్ వలయంలో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.  పెద్దగా ప్రతిఘటన కు
ఆస్కారం లేకుండా పోయింది. అంతగా కట్టుదిట్టం గా ప్లాన్ చేశాడు ఇంతియాజ్. అటూ ఇటూ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఆపరేషన్ విజయవంతం అయింది. 
తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇంతియాజ్. 
  ఆ రోజు సాయంత్రమే ప్రెస్ మీట్. విశాలమైన కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేశారు. హాలంతా  పాత్రికేయులతో కెమెరామెన్ తో  కిటకిటలాడుతుంది.వేదిక పై హోం మంత్రి
హోదాలో పరాంకుశరావు. డి.జి.పీ., ఇంటెలిజెన్స్ వింగ్ కమీషనర్, సిటీ కమీషనర్, ఇంతియాజ్, పోలీస్ అధికారులు. 
ఉదయం నుండే ఎలక్ట్రానిక్ మీడియా విశాల్ ఆత్మహత్య ను ఒక రేంజ్ లో టెలికాస్ట్ చేసింది. ప్రతి పక్ష నాయకులతో, రాజకీయ ప్రముఖులతో, ప్రముఖ పాత్రికేయులతో  చాలా
ఛానెల్స్ చర్చా వేదికలు ఏర్పాటు చేశాయి.
అవి ప్రజలను ఆవేశం పరిచాయి. ఆలోచింపజేశాయి. అప్పటికే ప్రభుత్వ ప్రాభవం కొంత మసక బారింది. అవకాశ
వాద రాజకీయ చతురులు  యధాశక్తి తమవంతు బాధ్యతగా  ప్రభుత్వం పై బురద చల్లారు. స్వచ్ఛంద సంస్థలు కూడా గళమెత్త పెద్ద పెట్టున గర్జించాయి. వాటి ఉనికి ని ఘనంగా చాటుకునే ప్రయత్నం చేశాయి. వీరి హడావిడితో, గోలతో  నాయకులు, సంస్థ లు మూగబోయాయి. అరిచి, ఆర్భాటం చేసే వాడిదే ఈ లోకం. ఆలోచన, చైతన్యం లోపించిన వారే గొర్రె దాటు ఇష్టపడతారు. నేటి సమాజంలో వారి శాతమే ఎక్కువ. 
మరి అధికారంలో ఉన్న ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంత ? సహజంగా చాలా సందర్భాల్లో ప్రతిపక్షం ఆరైతే. ప్రభుత్వం అరడజను. 
కాకపోతే  ప్రస్తుత  సందర్భంలో   ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడికి  వెనకేసుకునే ఆరాటం లేదనే చెప్పాలి. 
ప్రజలకు అంతో ఇంతో మేలు చేయాలన్న దుగ్ధ మాత్రం ఉంది.  అతడికి పరాంకుశరావు లాంటి శ్రేయోభిలాషుల వెన్ను దన్ను  మంత్రి వర్గం లో ఉంది. 
అందుకే తాము యువనాయకుడి పదవి, పరువు  కాపాడడానికి పరాంకుశరావు నడుం బిగించాడు. 
పాత్రకేయుల మొహాల్లో  ఉద్విగ్నత, అవధులు మించిన ఉత్సాహం . నేటి సమాజంలో నిజాలు నిగ్గు తేల్చే పత్రికలు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. సెన్సేషనల్ టాపిక్స్ తో సర్క్యులేషన్ పెంచుకోవాలని పత్రికలు, రేటింగ్ ఆకాశాానికి
దూసుకుపోవాలని ఎలక్ట్రానిక్ మీడియా అవకాశం కోసం
ఎదురు చూస్తుంటాయి. ప్రస్తుతం రెండు సువర్ణావకాశాలు   
వారిని ఊరిస్తూన్నాయి. ఒకటి..... డ్రగ్స్ రాకెట్ ఛేదించటంలో ప్రభుత్వ అలసత్వం( వారి హ్రస్వ దృష్టిలో ) రెండు ..... విశాల్  ఆత్మహత్య. 
పాత్రికేయ సంద్రాన్ని కలయజూశాడు పరాంకుశరావు. వారి నాడి, వాడి, వేడి గ్రహించగలిగాడు. గొంతు సవరించుకున్నాడు. 
" డియర్ ఫ్రెండ్స్ ! విశాల్ ఆత్మహత్య  దురదృష్టకర సంఘటన.  ఇలా జరిగి ఉండాల్సింది కాదు.  డ్రగ్స్ రాకెట్ వివరాలు తెలుసుకునే లోపలే ఈ ఘోరం జరిగిపోయింది. "
" డ్రగ్స్ రాకెట్ వివరాలు తెలిశాయా ? ఈ మాఫియా వెనుక రాజకీయ హస్త ముందా ?" బుల్లెట్ లా దూసుకొచ్చింది ఓ ప్రశ్న. 
ప్రశ్న వేసిన వాడు ఓ ప్రముఖ పత్రిక తరఫున వచ్చిన ఓ సీనియర్ పాత్రికేయుడు. 
అతడిని క్షణం కన్నార్పకుండా చూశాడు పరాంకుశరావు. 
" రాజకీయ హస్తం కాదు. ఉగ్రవాద హస్తం."
కాన్ఫరెన్స్ హాల్లో కలకలం. 
" డబ్బు కోసం గడ్డి తినే ముఠాలు సులభంగా దొరికి పోతాయి. కానీ...ఒక లక్ష్యం తో, ఈ రాష్ట్ర యువతను తప్పు దారి పట్టించి, అభివృద్ధి కొన్ని దశాబ్దాలు వెనక్కి పోయేలా చేసేవారు అంత సులభంగా  పట్టుబడరు. వారి వ్యూహాలు, 
కదలికలు కట్టుదిట్టం గా ఉంటాయి. అందుకే " సిట్" కు వారిని ట్రేస్ చేయడంలో కొంత జాప్యం జరిగింది. " 
" అసలు వారి ఉద్దేశ్యం ఏమిటి ? వివరంగా చెప్పండి"
మరో పాత్రికేయుడి ప్రశ్న. 
"భయంకరమైన డ్రగ్స్ కు అలవాటు పడిన పిల్లలు కొంతకాలానికి ఎందుకు పనికిరాకుండా పోతారు. చాలా మంది లో వారి చివరి మజిలీ చావు మాత్రమే.  కావల్సినంత డబ్బు స్వేచ్ఛ ఉన్న విద్యార్ధులు ...... ముఖ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులను టార్గెట్ చేసి 
వారు డ్రగ్స్ కు అలవాటు పడేలా ప్రోత్సహించడం  ఈ ఉగ్రవాద సంస్థ లక్ష్యం. ముందు ప్రయత్నం గా ఇరవై సంస్థల్లో రెండు వందల మంది ని వారి ఉచ్చులో బిగించి డ్రగ్స్ సప్లై చేస్తూ వచ్చారు. ఈ సంస్థ లన్నీ నగర పరిధితతత్య్రతతతైయ లోనే ఉన్నాయి. ఈ చీకటి వ్యవహారం అతి నేర్పు గా నడిపించే సంస్థ పేరు ఆపరేషన్ జన్నత్." 
మళ్ళీ హాల్లో కలకలం.
"ఇరవై సంస్థ లు రెండు వందల మంది విద్యార్థులు అని కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ?  " ఒక రంధ్రాన్వేషి
ప్రశ్న. పరాంకుశరావు చిరునవ్వు. 
" తొందరపడకు. సుదర్శనం !  అన్నీ వివరంగా చెబుతాను. సిట్ ఇన్ఛార్జ్ ఏసీబీ ఇంతియాజ్  టీం ఇటీవలే డ్రగ్స్ రాకెట్ 
నెట్ వర్క్ లోని కీలక వ్యక్తి ని పట్టుకోగలిగింది. అతడి ద్వారా నే ఈ సమాచారం తెలుసుకోగలిగాం.. ఇప్పుడు ఆ నెట్ వర్క్ లోని హ్యాకర్స్ందరూ మా కస్టడీ లోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం వారిపై దాడి జరిగింది. చాలా విజయవంతం అయిన ఆపరేషన్.  రెండు వైపులా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక తెరవెనుక వ్యక్తుల్ని పట్టకుంటే డ్రగ్స్ మాఫియా పునాదులు కదిలి పోతాయి. ఆ ప్రయత్నం కూడా ఓ కొలిక్కి వచ్చింది.  సో......ఈ మాఫియా ను ఛేదిఃచటం లో మా ప్రయత్న లోపం లేదు. ఈ లోపలే విశాల్ ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం " . గంభీరంగా ముగించాడు 
  హాల్లో కాసేపు ఎవరూ పెదవి విప్పలేదు. పరాంకుశరావు ఆచి తూచి మాట్లాడుతూ, ఆవేశం పడకుండా వాతావరణం లో మార్పు తీసుకువచ్చాడు. వేడి తగ్గింది. అందరికీ సత్యం బోధపడింది. 
మొదటి వరుసలో కూర్చున్న హరీష్ రావు 
వేదికపైకి వచ్చాడు. " ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి." పరాంకుశరావు తో అన్నాడు.
" అలాంటిదేమీ లేదు. " చిరునవ్వు తో ఆహ్వానించాడు పరాంకుశరావు.
" సభా ముఖంగా ఒక వివరణ ఇవ్వాలి. మీకు అభ్యంతరం లేకపోతే."
" ఎంత మాట.... తప్పకుండా, మైక్ ఇచ్చాడు.
"నేనెవరో మీకు తెలుసనుకుంటాను.   ఆత్మహత్య చేసుకున్న విశాల్ తండ్రి ని. ఈ దురదృష్టకర సంఘటన ను ఓ సంచలన వార్త గా ఇప్పటికే ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేసింది. 
పత్రికల్లో వచ్చే వార్తలు కూడా రేపు ఇలాగే సంచలనం రేకెత్తిస్తాయి. ఇందుకు కారణం విశాల్ ఆత్మ హత్య ఒక డ్రగ్స్ రాకెట్ తో ముడి పడి ఉండటం. కానీ ఈ రెండు సంఘటనలకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ వల్లే మా వాడు చనిపోయాడు . ఇది నిజం. కానీ ప్రభుత్వం ముందే మేల్కొని తగిన చర్య తీసుకోనందువల్ల మా వాడు చనిపోయాడు అని మీరనుకోవటం నిజం కాదు. అపోహ.
కేవలం సంచలన వార్తలు తమ స్వలాభం కోసం ప్రచారం చేసే  ప్రతి సంఘటన వికృతంగా, వక్రంగా కనిపిస్తుంది."
     ప్రతి మాటా బుల్లెట్ లా దూసుకొస్తోంది. హాల్లో నిశ్శబ్దం. ప్రశ్న ంటూ  ఎవరూ పైకి లేవలేదు.  పరాంకుశరావు, ఇంతియాజ్ ,  వేదికపై ఉన్న వారు తమ ఉనికినే మర్చి పోయారు.
" డ్రగ్స్ ఊబి లోంచి బయట పడలేక, మానసిక చిత్ర హింస భరించలేక  విశాల్ ఆత్మహత్య చేసుకున్నాడు." హరీష్ రావు గొంతు వణికింది. కళ్ళల్లో తడి. 
" మా నిర్లక్ష్యానికి, వాడి స్వయంకృతాపరాధానికి ఎవరూ కారణం కాదు.డ్రగ్స్ ను ఉగ్రవాదం ఒక ఆయుధంగా మలుచుకుంది. డబ్బు, స్వేచ్ఛ యువతను డ్రగ్స్ వైపు మళ్ళించాయి. ఇప్పుడు చెప్పండి. ఎవరిని తప్పు పట్టాలి? యువతనా ? ఉగ్రవాదులనా ? ఇది ఆది , అంతం లేని ప్రశ్న. 
అందుకే మరోసారి తల్లి దండ్రులను హెచ్చరిస్తున్నాను.  సంపాదన యావలో పడి పిల్లల్ని నిర్లక్ష్యం చేయకండి.  క్రమశిక్షణ నేర్పండి. బాధ్యతల విలువను చెప్పండి. వారసత్వం గా ఆస్తులు , అంతస్తులు ఇవ్వటం కాదు. సభ్యత, సంస్కారం నేర్పండి." క్షణం ఆగి, అందరికీ నమస్కరించి వేదిక దిగి బయటకు వెళ్ళి పోయాడు. 
రెండు క్షణాల విరామం తర్వాత కాన్ఫరెన్స్ హాలు చప్పట్లతో మార్మోగింది..
****"**************"******************************
                                       
.                                       కొనసాగించండి 44 లో