అన్వర్ హూసేన్ ... హైదరాబాదీ...పి.ఓ.కే మిలిటెంట్ క్యాంప్ లో విగరస్ ట్రైనింగ్.  ఆవేశం కన్నా ఆలోచన పాలు ఎక్కువ . టీం లీడర్ గా సరిహద్దు దాటుతూ బ్రతికి పోయాడు.  ఇప్పుడీ మహానగరం జనసంద్రం లో  కలిసి పోయారు. అతడి ఆచూకీ తెలుసుకోవటం మన డ్యూటీ. "   అన్వర్ కంప్యూటర్ ఇమేజ్ చూస్తూ ఇంతియాజ్ అన్న మాటలివి. 
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ..స్పెషల్లీ ట్రైన్డ్ ఇన్ కంబాటింగ్ మిలిటెంట్ ఎటాక్స్.
     " ఉన్న జిహాద్ లు చాలవన్నట్లు పులి మీద పుట్రలా ఆపరేషన్ జన్నత్ ఏమిటి సార్ ?" అతడి అసిస్టెంట్ విహారి గొంతులో చిరాకు.
    మా భాషలో  జన్నత్ అంటే స్వర్గం.  స్వర్గానికి  జిహాద్ కు ఏమిటి కనెక్షన్. " విహారి ని చూశాడు. 
   " అదే సార్ ! నా ప్రశ్న కూడా . ఏమిటి కనెక్షన్ ? " అర్థం కాక బుర్ర గోక్కున్నాడు. 
   " ఈ మిషన్ మార్గమేమిటి? హింసా ? అహింసా ? చాప కింద నీరులా ఏదో కొత్త వ్యూహం తో  ఇస్లాం రాజ్యాన్ని స్థాపించటమా ?"
   " ఏమిటి సార్ ? ప్రశ్నల మీద ప్రశ్నల తో నన్ను కంగారు పెడుతున్నారు . "
ఇంతియాజ్  విహారి నెత్తిమీద చిన్నగా మొట్టాడు . 
   ఇలాంటి అనలిటికల్ అప్రోచ్ నాకు కాదు ట్రైనీ గా నీకుండాలి . సమస్య వచ్చినప్పుడే బుర్రను పదును పెట్టాలి. నా ప్రశ్నలకు నీ జవాబులేమిటి ?"
విహారి ఆలోచన లో పడ్డాడు . 
" పులి మాంసాహారం మానింది .జిహాదీ తుపాకీ త్యాగం చేశాడు ". ఈ రెండూ జరుగుతాయా ?
   " నువ్వన్నది నిజమే  !  కాని వారి ఆప్రోచ్ లో మార్పు ఫలితమే ఈ ఆపరేషన్ జన్నత్ "
" సార్ !  ఒక సగటు మధ్యతరగతి యువకుడి నర నరంలో
మతం మార్ఫియా ఎక్కించి , మారణాయుధాలు  ప్రయోగించే విధ్వంసక శిక్షణ ఇచ్చి , ఆత్మాహుతి యోధుడిగా చావుకు సిద్ధం చేయటం అంత సులభం కాదు. అందుకు ఓర్పు, నేర్పు,
సంచుల నిండా సొమ్ము కావాలి. వెనకా ముందూ చూసుకోకుండా ఆత్మాహుతి దళాల పేరుతో తమ వారిని జిహాదీ లకు బలి చేస్తే మిలిటెంట్ ఫోర్స్ తగ్గిపోతుంది. అనుకున్న లక్ష్యం అనుకున్న టైమ్ లో సాధించటం కష్టమవుతుంది.  అందువల్ల వారిని ఎలా వేయకుండా దాడులు ఎలా చెయ్యాలో కొత్థ పద్ధతులు కనిపెట్టి ఉంటారు .
ఆపరేషన్ జన్నత్ అదేనేమో " సాభిప్రాయంగా చూశాడు విహారి.  
  " నీ విశ్లేషణ బాగుంది.  అదే నిజమైతే మనమూ కౌంటర్ ఎటాక్  వ్యూహాలు మార్చుకోవాలి. లెటజ్ వెయిట్ అండ్ సీ"
   " అంటే ఒక ఎటాక్ జరిగాకా ? నవ్వుతూ అన్నాడు
" వాళ్ళు దాడులు చేయకముందే మనం పసిగట్టి ఆపాలనుకుంటాం. ప్రాణ నష్టం జరగకుండా ఆపటం మన బాధ్యత.  కాని , అందుకు పరిస్థితులు అనుకూలించాలిగా "
   అవునన్నట్లు తొలి ఊపాడు విహారి.
   " రేపు జరగబోయే సద్భావనా సమావేశం ప్రభావం యువత పై ఎలా ఉంటుందో ? డా. ఇనాయతుల్లా తో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది . ఇస్లాం పై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది . ఇతర మతాల గురించి కూడా ఆయన అధ్యయనం చేశారు.  అన్నింటిని మించి మంచి వక్త.  శ్రోతలను లాజికల్ గా ఒప్పించటంలో మంచి నేర్పు ఉంది.
  రేపు మనం వెళుతున్నాం. ఆయన ఉపన్యాసానికి యువత
స్పందన ఎలా ఉంటుందో గమనించ బోతున్నాం. వెళుతున్నాం కదా ?"
" దటీజ్ అవర్ డ్యూటీ.  పైగా వ్యక్తిగతంగా నాకు ఆహ్వానం
కూడా అందింది. ". విహారి సందేహం తీర్చాడు. 
              .  """****************"""""
రవీంద్ర భారతి వేదిక వెనుక ఫ్లైక్స్ బ్యానర్ పాల తెలుపు వర్ణంలో మెరిసిపోతోంది. బంగారు రంగు బార్డర్ తో , చిక్కటి ఊదా రంగు అక్షరాల తో మెరిసి పోతూ చూపరుల దృష్టి ని
ఆకర్షించే లా ఉంది. 
'సద్భావనా సమావేశం' అన్న అక్షరాలు ఉర్దూ , తెలుగు , ఆంగ్ల భాషల్లో అందంగా తీర్చిదిద్దారు. 
   ముఖ్యంగా యువత కు , కొందరు ప్రముఖులకు మాత్రమే అక్కడ  ప్రవేశం .   బహిరంగ సభ కాదు.   
మీడియా ముందు వరుసలో ఉంది . రెవెన్యూ మంత్రి విశిష్ట అతిథి కావటం ,. ఆ సమావేశంలో మతం ప్రధాన అంశం కావటం తో టైట్ సెక్యూరిటీ కనిపిస్తుంది. 
   రవీంద్ర భారతి ముందు రెండు వైడ్ స్క్రీన్స్ అమర్చారు. 
సభా కార్యక్రమాన్ని సామాన్యులు కూడా చూసేందుకు సౌకర్యం కల్పించారు .  
   ఆ విశాలమైన ఆడిటోరియం  దాదాపు నిశ్శబ్దం గా ఉంది.
వేదిక పైన ఆహ్వానింపబడిన ప్రముఖులు అందరూ కూర్చొని ఉన్నారు.   ఆనవాయితీగా జరిగే కార్యక్రమాలన్నీ ముగియగానే విశిష్ట అతిథి రోష్ట్రమ్ ముందు నిలబడి గొంతు సవరించుకున్నాడు. 
     " సభా లోని పెద్దలకు నమస్కారం.  యువత కు ఆశీస్సులు.  నేనీ నగరం పౌరుడిగా , సామాన్యుడిగా ఈ సభకు వచ్చాను . మీ పార్టీ తరపున కానీ , అధికార హోదాలో కానీ రాలేదు. 
  ఇనాయతుల్లా గారు విద్యావేత్త , ఉత్తమ ఉపాధ్యాయుడు.
మనసున్న మనిషి. నాకు బాల్య స్నేహితుడు. ఒకే ఊరి వాళ్ళం . ఒక ఆశయం తో ప్రొఫెసర్ పదవిని కూడా కాదని ,
లక్నో వదిలి హైదరాబాద్ కు  తిరిగి వచ్చారు .  ముస్లిం సమాజంలో  ఆయన తెలియని వారు చాలా తక్కువ. ఒక్క ఇస్లామే కాదు , ఈ దేశంలో ని అన్ని  మతాల గురించి ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది . మతం పేరిట జరిగే
రాజకీయ కుట్రలు , ఓటు బ్యాంకు రాజకీయాలు ,ఒక భారతీయ పౌరుడిగా ఆయనను చాలా కలవర పెట్టాయి . 
     యువత తప్పు దారిలో పోతుందని ఆయన బాధ . వారిని సరైన దారిలో నడిపించి , మతాలకు అతీతంగా , శాంతియుత సహజీవన అవసరం గురించి వివరించటం ,
ఆ దారిలో  నడిచేలా వారిని ప్రోత్సహించడం ఆయన భవిష్యత్ కార్యక్రమం . ఆయన కోరిక మీద , ఆయన ప్రాణం స్నేహితుడిగా నా వంతు సహకారం అందించటం నా ధర్మం . 
అందుకే నా మతాన్ని, పదవిని , హోదాను ఈ వేదిక తొలి మెట్టు పైనే వదిలేసి , ఆయన మాటల్లో చెప్పాలంటే ఓ భారతీయ పౌరుడిగా మీ ముందుకు వచ్చాను . ఆయన చెప్పే ప్రతి మాట శ్రద్ధ గా వినండి . ఆలోచించండి . మీ కోసం, సమాజం కోసం, దేశం కోసం మీరేం చెయ్యాలో  ప్రశాంత మనసుతో నిర్ణయించుకోండి .  మీరీ నిర్ణయం తీసుకోవటం చాలా అవసరం.  ఈ అరుదైన అవకాశం నాకు ఇచ్చినందుకు
నా మిత్రుడి కి , ఈ సభా నిర్వాహకులకు కృతజ్ఞతలు. సెలవు. మంత్రి వినయం గా చేతులు జోడించాడు. 
   రాజకీయ రంగు , రుచి , వాసన లేని నిఖార్సయిన మాట తీరు.  మూసి ధోరణి,  పడికట్టు పదాల పోపు  లేని ఉపన్యాసం.
ఇనాయతుల్లా రోష్ట్రం ముందు నిల్చున్నాడు . తెల్లటి పైజామా , తెల్లటి పొడుగు లాల్చీ, పైన నల్లటి  ఆర్మ్ లెస్ కోట్ . పైకి దువ్విన క్రాష్ , విశాలమైన నుదురు , చిన్న మీసం , గడ్డం ..... చూడగానే ముస్లిం అనిపిస్తాడు
  ప్రశాంత మైన చూపులు , పెదవులపై చెరగని చిరునవ్వు
ఆయన ప్రత్యేకత లు.  అనుభవం తో , అవలోకనం తో మృదు గంభీరంగా  కనిపిస్తాడు .
  " సభకు నమస్కారం. నా ఆహ్వానం మన్నించి ఈ సభకు ఇంతమంది హాజరైనందుకు చాల సంతోషం.  నా ప్రాణ మిత్రుడు షేక్ మస్తాన్ జీ  తనను భారతీయ పౌరుడి గా
పరిచయం చేసికొని ఈ సభకు నిండుదనం తీసుకు వచ్చారు .  మొదట మనం భారతీయులం. ఆ తర్వాతే మనం అభిమతం, మతం , ఆలోచనలు.
    మాట తీరులో వినయం , సంస్కారం. భావం ప్రకటనలో , ఉర్దూ భాషా ప్రయోగంలో విద్యాగంధం గుబాళిస్తోంది.
ఇనాయతుల్లా ఉపన్యాసం తెలుగు లో  తర్జుమా చేసే అనువాదకుడికి రెండు భాషల్లో  మంచి పట్టు ఉంది. అందుకే అనువాదం మూలాన్ని ఏ మాత్రం స్థాయి తగ్గకుండా వ్యక్త పరుస్తూ  ఓ ప్రవాహంలా సాగిపోతోంది.
ప్రొఫెసర్ గా ఇనాయతుల్లా కు పాతికేళ్ల అనుభవం ఉంది. ఈ సుదీర్ఘ కాలగమనంలో యువత మనోభావాలు , ఆకాంక్షలు,
వారిపై విపరీత పోకడలు చూపే కుళ్ళిన ఈ సమాజపు పడగనీడను నిశితంగా గమనించాడు .  చేస్తున్న ఉద్యోగం వదులుకొని యువతకు దిశానిర్దేశం చేసే ఉద్యమం సంకల్పించాడు.
  ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కావలసిన తెగువ
తెగింపు పుష్కలంగా ఉన్నవాడు .
  మతం గాని , మన జీవితానికి సంబంధించిన ఏ అంశమైనా
వివరించాలంటే ప్రకృతి నే ఉదాహరణ గా  తీసుకోవాలి.
ప్రకృతి స్వభావం , ప్రకృతి లో క్షణ క్షణానికి జరిగే మార్పులు
మనకు భగవంతుడు పంపే సంకేతాలు. ఆ సంకేతాలను మనం గమనించగలిగితే ఎన్నో సత్యాలు, జీవిత ధర్మాలు  అనుభవం లోకి వస్తాయి. 
బయోడైవర్సిటీ ---- ఈ పదాన్ని మనం అనేక సందర్భాలలో వింటూ ఉంటాం. తెలుగు లో జీవ వైవిధ్యం అంటారు. జీవ వైవిధ్యం ప్రక్రృతి ధర్మం. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు ఒక ప్రదేశంలో ని వృక్ష జాలాన్ని , జంతువుల పుట్టుక,  స్వభావాలను ప్రభావితం చేస్తాయి.  అందుకే భూమి మీద పన్నెండు సహజ సిద్ధ మండలాలు ఏర్పడ్డాయి. ఈ వైవిధ్యమనేది ప్రకృతి లోనే కాదు , మనిషి లో కూడా ఉంది.  
      అడవుల్లో , కొండలపై, జీవించే వారికి, మధ్య నదీ తీర
మైదానంలో  జీవించే వారికి మధ్య శరీర ధారుఢ్యం లో , ఆలోచనల్లో , అలవాట్ల లో చివరకు నమ్మకాల్లో కూడా చాలా బేధం ఉంది.
      ఆటవికుల్లో చాలామంది శక్తినే పూజిస్తారు. అందుకు వారి జీవన విధానం ,  అడవులే కారణం. అడవుల్లో అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రాణ భయం నీడలా అనుసరిస్తున్నప్పుడు సాహసం , సమయస్ఫూర్తి, తెగువ తెగింపు చాలా అవసరం. బ్రతుకు దెరువు కోసం వారు ఎంతో శ్రమించాలి. ఈ లక్షణాలన్నీ వారి శక్తి ఆరాధనకు కారణమైనాయి. మరో ప్రత్యేకత --- ఆటవికులు శక్తి ఉగ్ర రూపాన్నే ఇష్ట పడతారు. 
    నాగరికులు కొలిచే శక్తి ముఖం లో సౌమ్యత ,  చూపుల్లో ప్రశాంతత ఉంటాయి. ఆమె సుఖాసనం లో ఉంటుంది. చేతిలో ఆయుధాలు కూడా పరిమితమే. మరి.. ఆటవికుల శక్తి వీరోచితంగా నిలబడి ఉంటుంది.  ఎర్రటి నేత్రాలతో, చాపిన  ఎర్రటి నాలుక తో రౌద్రం గా ఉంటుంది. మెడలో కపాలమాల , చేతిలో మనిషి తల......
ఆగాడు ఇనాయతుల్లా.
    " ఒక ముస్లిం వ్యక్తి కి వేరే మతం గురించి ఇంతటి అవగాహన ఉండటం  చాలా అరుదు . ఈ ప్రత్యేకత అతడి విశాల దృష్టి కి  పరిశీలన కు అద్దం పడుతుంది..   సభికులు తమ ఉనికిని మరిచారు. 
   ఇలా మనిషి పై  ప్రకృతి క్షణ క్షణం ప్రభావం చూపుతున్నపుడు ఈ భూమి పై పుట్టిన మనుషులందరి ఆలోచనలు ఒకే మూసలో ఎందుకు ఉంటాయి ?  వారి ఆహారపుటలవాట్లు , వేషధారణ ఒకేలా ఎందుకుంటాయి ?
సాంప్రదాయాలు, ఆచారాలు మారుతాయి. సామాజిక పరిస్థితులు మారుతాయి. ఈ కారణం వల్లే ప్రపంచంలో అనేక మతాలు, విశ్వాసాలు పుట్టుకొచ్చాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ప్రకృతి మనకు నేర్పిన పాఠం.  ఏ మతమైనా బోధించేది ఆదర్శవంతమైన జీవన విధానం. కొన్ని నియమాలు , ఆచారవ్యవహారాలు, నీతి సూత్రాలు, సత్యం, పరోపకారం , సానుభూతి, భూతదయ, ఆత్మోన్నతి
అన్ని మతాలకు సమానమే. నియమాలు, ఆచారవ్యవహారాలు ప్రతి మతానికి మారుతుంటాయి. ఇందుకు కారణం ఒక నిర్దిష్టమైన  ప్రదేశం లోని సాంఘిక , భౌగోళిక పరిస్థితులు. విగ్రహారాధనను ఇస్లాం ఖండిస్తుంది.
హైందవ మతంలో విగ్రహారాధన ముఖ్యమైన అంశం.  ఆనాడు ప్రవక్త విగ్రహారాధనను ఖండించడానికి కారణం సామాజిక పరిస్థితులే కారణం. ఇస్లాం మతం స్థాపనకు ముందు అరబ్బులు అజ్నానమనే చీకటి యుగం లో ఉన్నారు . ఎన్నో తెగలుగా విడిపోయిన నాటి అరబ్బుల సమాజంలో అంతః కలహాలు, వర్గ పోరాటాలు , సాంఘిక దురాచారాలు సామాన్యుల జీవితాలను నరకప్రాయం చేశాయి. ఎవరి నీతి వారిది ఎవరి కట్టుబాట్లు వారివి.
  " ఆ కాలంలో ప్రతి తెగకు ఒక దేవుడుండే వాడు . ప్రధమ దైవం గృహమైన " కూడా" లో  దాదాపు 300 విగ్రహాలు వివిధ తెగల కు సంబంధించినవి ఉండేవి.  వీరి మృతి విశ్వాసాల్లో  ఒక పద్ధతి, పొంతన  లేని కారణాన హింస , అశాంతి రాజ్యమేలుతుండేవి . ఇందుకే  ప్రవక్త  విగ్రహారాధనను తీవ్రంగా ఖండించారు.  హిందూ మతం లో ఈ అనంత విశ్వాన్ని  నడిపించే చైతన్యం ఒకటే అన్న భావన పునాది.  సత్యం ఒక్కటే. సత్యాన్వేషణే అందరి లక్ష్యం. చైతన్యం ఒకటే అయినప్పుడు ఆ చైతన్యాన్ని ఏ రూపంలో కొలిచినా తప్పు లేదుగా !  మన సంస్కారం, ప్రవృత్తి కి అనుకూలంగా ఏ రూపంలో ఊహించుకున్నా , పూజించు కున్నాం ఎవరికీ అభ్యంతరం ఉండదు .  మార్గం ఏదైనా లక్ష్యం ఒక్కటే.  అలా ఓ తాత్విక పరమైన కారణం విగ్రహారాధన కు , వివిధ రూపాలకు మూలం అయింది. " సెలయేటి గమనం తో ఇనాయతుల్లా  భావ ధార పరుగులు తీస్తోంది. 
                   ................ కొనసాగించండి 9
..
 .